ఎండలు దంచికొడుతున్నా 77 శాతం మంది భారతీయుల్లో ‘డి’ విటమిన్ లోపం!

  • జూన్ 21ని ‘విటమిన్ డి డే ఆఫ్ ఇండియా’గా ప్రకటించిన ఐఎంఏ 
  • దేశంలో సమృద్ధిగా సూర్యరశ్మి.. అయినా దక్కని ‘డి’ విటమిన్
  • పట్టణ జీవనశైలి, కాలుష్యం, సన్‌స్క్రీన్ వాడకం,  చర్మ రంగు వల్ల తగ్గుతున్న విటమిన్-డి ఉత్పత్తి 
  • రోజూ 15-30 నిమిషాల పాటు ఎండలో గడపాలని నిపుణుల సలహా 
  • విటమిన్ -డి లోపంతో ఆస్టియోపోరోసిస్, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి ప్రమాదాలు
భారతదేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఒక నిశ్శబ్ద ఆరోగ్య సంక్షోభాన్ని అడ్డుకునేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) సరికొత్త చొరవ తీసుకుంది. ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థ ‘అబ్బాట్’ (Abbott) భాగస్వామ్యంతో, సంవత్సరంలోనే అత్యంత సుదీర్ఘమైన రోజైన జూన్ 21ని ‘విటమిన్ డి డే ఆఫ్ ఇండియా’గా ఐఎంఏ ప్రకటించింది. 

దేశవ్యాప్తంగా దాదాపు 77 శాతం మంది ప్రజలు తీవ్రమైన విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారనే చేదు నిజాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పుష్కలంగా సూర్యరశ్మి ఉండే మన దేశంలో, ఇంత భారీ స్థాయిలో ప్రజలు ‘సన్‌షైన్ విటమిన్’ లోపంతో బాధపడుతుండటంపై ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అనిల్‌కుమార్ జె.నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎముకల బలం, కండరాల పనితీరు, శరీర రోగనిరోధక శక్తిని కాపాడటంలో విటమిన్-డి పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ ప్రత్యేక రోజు ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

అయితే, ఏడాది పొడవునా ఎండలు దంచికొట్టే భారత్‌లో ఈ స్థాయి విటమిన్ లోపం రావడాన్ని వైద్య నిపుణులు ‘సన్‌షైన్ పారడాక్స్’ (సూర్యరశ్మి వైరుధ్యం) గా అభివర్ణిస్తున్నారు. ఆధునిక పట్టణ జీవనశైలి కారణంగా ప్రజలు రోజంతా ఇళ్లలోనే లేదా ఏసీ ఆఫీసుల్లోనే గడపడం, శారీరక శ్రమ తగ్గడం, వాయు కాలుష్యం వల్ల సూర్యుడి నుంచి వచ్చే ఆల్ట్రావైలెట్ బి (UVB) కిరణాలు చర్మానికి చేరకపోవడం దీనికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. 

అలాగే, వీటితో పాటు సన్‌స్క్రీన్ లోషన్ల అతి వాడకం, శరీరాన్ని పూర్తిగా కప్పేసే దుస్తులు ధరించడం, మన దేశస్థుల ముదురు చర్మ రంగు (మెలనిన్ శాతం ఎక్కువ ఉండటం) కూడా చర్మంలో విటమిన్-డి సహజ ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. నీరసం, కండరాల నొప్పులు, తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడటం వంటివి దీని ప్రాథమిక లక్షణాలు కాగా.. దీర్ఘకాలంలో ఇది ఎముకల క్షీణత (ఆస్టియోపోరోసిస్)కు, రోగనిరోధక శక్తి పూర్తిగా పడిపోవడానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అబ్బాట్ ఇండియా మెడికల్ అఫైర్స్ డైరెక్టర్ డాక్టర్ జెజో కరణ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య కనీసం 15 నుంచి 30 నిమిషాల పాటు ఎండలో గడపడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చని సూచించారు. అయినప్పటికీ, కేవలం సూర్యరశ్మి మాత్రమే అందరికీ సరిపోకపోవచ్చని, క్రమం తప్పకుండా రక్త పరీక్షలు (స్క్రీనింగ్) చేయించుకోవడం ద్వారానే అసలు లోపాన్ని గుర్తించగలమని స్పష్టం చేశారు. భారతదేశంలో ఆహార పదార్థాలలో విటమిన్-డిని ఫోర్టిఫికేషన్ (కలపడం) చేయడం, ప్రజా రక్షణ విధానాలను బలోపేతం చేయడం ద్వారానే ఈ ఆరోగ్య లోపాన్ని అరికట్టగలమని ఐఎంఏ స్పష్టం చేసింది.  

Indian Medical Association
Vitamin D deficiency India
Vitamin D Day June 21
Sunshine Paradox
Abbott Healthcare India
Bone health and immunity

More Telugu News